అల వైకుంఠపురములో సక్సెస్‌తో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవటంతో మరోసారి త్రివిక్రమ్‌ సత్తా చాటాడు. అజ్ఞాతవాసి సినిమా సమయంలో త్రివిక్రమ్ మీద పెత్త ఎత్తున విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా కథ కాపీ అన్న ఆరోపణలు రావటంతో పాటు కథనం విషయంలోనూ త్రివిక్రమ్ పెన్‌లో ఇంక్‌ అయిపోయిందన్న వార్తలు వినిపించాయి. అయితే తన మీద వస్తున్న ఆరోపణలకు సూపర్‌ హిట్‌తో సమాధానం చెప్పాలనుకున్న మాటల మాంత్రికుడు అల వైకుంఠపురములో సినిమాతో ఆ ఫీట్ సాధించాడు.

 

అల వైకుంఠపురములో సినిమా తరువాత యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్‌. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మరోసారి అదే కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందన్న వార్తలతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్‌ కూడా ఫిక్స్‌ అయ్యిందన్న టాక్‌ వినిపిస్తోంది.

 

ఇటీవల ఫిలిం ఛాంబర్‌ కొత్తగా కొన్ని టైటిల్స్‌ రిజిస్టర్ అయ్యాయి. అందులో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్, ప్రభాస్‌ సినిమాల టైటిల్స్‌ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్స్‌తో పాటు హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ క్లాసిక్‌ టైటిల్‌ను రిజిస్టర్‌ చేశారు. `అయినను పోయి రావలే హస్తినకు` అన్నదే ఆ టైటిల్‌. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో కేవలం త్రివిక్రమ్ దర్శకత్వంలో మాత్రం సినిమాలు తెరకెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యానర్‌ ఓ టైటిల్‌ను రిజిస్టర్ చేయటంతో అది మాటల మాంత్రికుడి నెక్ట్స్ సినిమా కోసమే అన్న ప్రచారం జరుగుతోంది.

 

అంతేకాదు.. త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ అ అనే అక్షరంతో  ప్రారంభమైన టైటిల్‌.. టైటిల్‌లో క్లాసిక్‌ టచ్‌ చూస్తుంటే అది పక్కాగా త్రివిక్రమ్‌ సినిమా టైటిలే అని ఫిక్స్‌ అవుతున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభం కావటానికి మాత్రం ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుంది. అంటే అప్పటి వరకు ఎన్టీఆర్‌ మరో సినిమా చేసే ఛాన్స్‌ లేదు. ఒకవేళ షూటింగ్ త్వరగా ముగించినా.. కనీసం ఆగస్టు వరకైన ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల్లోనే ఉంటాడు తారక్‌. ఆ తరువాతే త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌కు ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: