అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న క్యూట్ ఫిల్మ్ `ఓ పిట్ట కథ`. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. కేరింత, మనమంతా తదితర చిత్రాలతో ఆకట్టుకున్న విశ్వంత్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యాశెట్టి కథానాయికగా అలరించనుంది.
ఈ సినిమా టీజర్ను సూపర్స్టార్ మహేష్ బాబు శుక్రవారం ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఓ పాపకు తండ్రి కథ చెప్పాలనుకుంటే.. ఆ పాపే తండ్రికి కథ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. అందమైన పల్లెటూళ్లో అందమైన వెంకట లక్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్రభుకి వెంకట లక్ష్మి అంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అదే సమయంలో వెంకటలక్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే మరో యువకుడు వస్తాడు. అతను కూడా వెంకట లక్ష్మిని ఇష్టపడతాడు. అదే సమయంలో కథలో అనుకోని మలుపు తిరుగుతుంది. వెంకటలక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? అంటూ సినిమా కథ ఏంటో టీజర్లోనే చెప్పేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీకి టాప్ స్టార్స్ మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ పోస్టర్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా, కాన్సెప్ట్ పోస్టర్ ని కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ , కారక్టర్స్ పోస్టర్ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఆవిష్కరించారు. రానా దగ్గుబాటి ప్రీ టీజర్ విడుదల చేసారు. అందరూ ఈ సినిమా కాన్సెప్ట్ విభిన్నంగా ఉందని అభినందిస్తున్నారన్నారు దర్శక నిర్మాతలు. చిత్ర టైటిల్ పిట్ట కథే అయినా ఇది చాలా పెద్ద కథే. కథనం పరంగాను విజువల్స్ పరంగాను సమ్మర్లో రిలీజ్ అయ్యే ఏ పెద్ద సినిమాకైనా పోటీనిచ్చేలా ఉందని కొరటాల శివ చెప్పగా, వైవిధ్యమైన కథ కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందన్నారు త్రివిక్రమ్, హరీష్ శంకర్.