చేసింది కేవలం నాలుగు సినిమాలే అయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ, తరువాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. టాలీవుడ్ లో రాజమౌళి తరువాత ఫ్లాప్ ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఒక్కడే. అందుకే కొరటాలతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
ఇంత ఫాంలో ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పటికే తన రిటైర్మెంట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు కొరటాల. తాను కేవలం పది సినిమాలు మాత్రమే తీయాలని నిర్ణయించుకున్నాని, తన పదో సినిమానే తన చివరి సినిమా అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. తిరుగులేని మాస్ డైరెక్టర్గా ఎదిగిన ఓ దర్శకుడు కేవలం పది సినిమాలకే రిటైర్మెంట్ తీసుకోవటం అన్నది షాకింగ్ నిర్ణయమే అని చెప్పాలి.
అయితే అందుకు కారాణాలు కూడా వెల్లడించాడు. ప్రస్తుతం తన దగ్గర ఉన్న పది కథలు మాత్రమే డైరెక్ట్ చేస్తానని, ఆ తరువాత ఇండస్ట్రీలో కొనసాగినా దర్శకత్వం మాత్రం చేయనని చెప్పేశాడు. అంటే నిర్మాతగా మారే ఆలోచనలో ఉన్నట్టుగా వెల్లడించాడు కొరటాల. అయితే కొసమెరుపుగా తాను ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నాని అయితే భవిష్యత్తులో ఈ నిర్ణయంలో మార్పులు కూడా ఉండవచ్చని చెప్పి ఆశలు కల్పించాడు.
భరత్ అనే నేను సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటించనుంది.