టాలీవుడ్ చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఇక లేరు. ఆయన కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే వనస్థలిపురంలో ఉన్న హాస్పటల్లో మృతి చెందారు. ఎన్నో సినిమాలకు పీఆర్ ఓగా కూడా తన సేవలను అందించారు. ఎన్నో పుస్తకాలను రచించారు. ఎందరివో సెలబ్రెటీల జీవితగాధలను రచించారు. మహానటి సావిత్రి, చిరంజీవిగారు, ఇలా ఎన్నో పుస్తకాలను రచించారు. చివరిగా ఆయన రాసిన పుస్తకం అందాల తార శ్రీదేవి జీవిత చరిత్రను రాశారు. వాళ్ళతో ఆయనకున్న అనుభవాల గురించి ఆ పుస్తకాలు చదివితే మనకు అర్ధం అవుతుంది. ఆయన ఎంత పెద్ద సీనియర్ పాత్రికేయుడు అన్న విషయం. ఆయనకు సినిమారంగంలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు పనిచేసిన చాలా మంది పాత్రికేయులు దిర్భాంతికి గురయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఆయన ఎంతో ఆప్తుడని చెప్పాలి. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆయన తన సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన టాలీవుడ్ లో ఎంతోమంది ఇండస్ట్రీ లోని పెద్దల తలలో నాలుకగా ఉన్నారు. ఆయన మొదట విశాలాంధ్ర పత్రికకు జర్నలిస్ట్ గా పనిచేసారు. ఆ తరువాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా జర్నలిస్ట్గా పనిచేసారు. ప్రస్తుతం ఆయన సురేష్కొండేటి 'సంతోషం' సినీ వార పత్రికకు జర్నలిస్ట్గా ఆయన తన సేవలను అందిస్తున్నారు. పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు.
డిగ్రీ వరకు చదివిన ఆయన.. ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్ గా కూడా చాలా కాలం పాటు పనిచేసారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా నేటి యంగ్ హీరోలను సైతం ఇంటర్వ్యూలు చేసిన అనుభవం పసుపులేటి రామారావుకు ఉంది. రాంచరణ్ వినయ విధేయరామ చిత్రం ఇంటర్వ్యూలో రామారావుగారిని ప్రత్యేకంగా అంతమంది జర్నలిస్టులలో గుర్తుపట్టి మరీ రాంచరణ్ దగ్గరకు వచ్చి మరీ పలకరించారు. రామారావుగారు మీ ఆరోగ్యం బావుందా అంటూ.. అంటే దీన్ని బట్టే అర్ధం చేసుకోవాలి ఆయనకు టాలీవుడ్లో ఎంత మంచి పేరు ఉంది అన్న విషయం. అలాగే చాలా మంది సీనియర్ నటీమణులు కూడా ఆయనను గుర్తు చేసుకుంటారు.