జబర్ధస్త్ షోలో టాప్‌ కమెడియన్‌ ఎవరు అంటూ తడుముకోకుండా వెంటనే చెప్పే పేరు హైపర్ ఆది. వరుస పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించే ఆది మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నాగబాబు జబర్ధస్త్ జడ్జ్‌గా ఉన్న సమయంలో ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు ఆది. అయితే ఇప్పుడు అదే ఆది మీద మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.


అందుకు చాలా పెద్ద కారణమే ఉంది. జబర్దస్త్ షోలో నాగబాబు ఉన్నన్ని రోజులు ఆయనకు అనుంగు అనుచరుడిగా ఉన్న ఆది, నాగబాబు వెళ్లిపోయిన దగ్గర నుంచి రెచ్చిపోతున్నాడు. ప్రస్తుతం నాగబాబు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నఅదిరింది షో పైనే ఓ రేంజ్‌లో సెటైర్స్ వేస్తున్నాడు. ఈ మధ్య ఓ స్కిట్‌లో నన్ను, అనసూయను, రోజా గారిని తీసుకెళ్లి కుదిరింది అనే షో పెట్టుకోరా అంటూ మరో కమెడియన్ రాజుపై సెటైర్ వేసాడు. ఆ డైలాగే ఇప్పుడు ఆదిని మెగా ఫ్యాన్స్‌కు దూరం చేసింది. ఇన్నాళ్లు మెగా ఫ్యాన్స్‌ లో ఒకడిగా ఉన్న ఆది ఇప్పుడు అదే ఫ్యాన్స్‌కు శత్రువుగా మారిపోయాడు.

 

గతంలో జబర్థస్త్‌లో ప్రతీ స్కిట్‌కు చిరంజీవి పాటతోనే ఎంట్రీ ఇచ్చేవాడు ఆది. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ల గెటప్‌లను కామెడీగా ప్రజెంట్‌ చేస్తూ ఎంట్రీ ఇస్తున్నాడు. వరుసగా గబ్బర్‌ సింగ్‌, గద్దలకొండ గణేష్, సైరా, అల వైకుంఠపురములో సినిమాలను పేరడీ చేస్తూ ఆటపట్టించాడు. ఇలా వరుసగా మెగా హీరోలను టార్గెట్ చేయటంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. స్కిట్‌కు అవసరం లేకపోయినా కావాలనే మెగాఫ్యామిలీ టార్గెట్‌గా పంచ్‌లు పేలుస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఆది మీద ఉన్నాయి.

 

ఇక మీద అలాంటి స్కిట్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులు ఆదిని కోరుతున్నారు. మరికొంత మంది అభిమానులైతే కాస్త ఘాటుగానే వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. మెగా అభిమాని అని చెప్పుకొని ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీపై సెటైర్లు వేయటం ఏంటి అంటూ కత్తులు నూరుతున్నారు. మరి ఆరోపణలపై ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: