తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు ఎంతో మంది ఇతర భాష హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరో..తెలంగాణ యాసలో భానుమతి హైబ్రీడ్ పిల్లా.. ఒక్కటే పీస్ అంటూ సాయి పల్లవి చేసే అమాయకపు అల్లరికి తెలుగు ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. మొత్తానికి ఈ అమ్మడు తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించింది. మారి చిత్రలో ధనుష్ కి పోటీగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం చాలా మంది నటీ, నటులు సినీ ఇండస్ట్రీపైనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఫోకస్ పెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే సినిమాలని కొంటూ కొత్త తరహా కంటెంట్కు తెరలేపింది. నెట్ ఫ్లిక్స్ కూడా దక్షిణాదిపై గురిపెట్టింది.
బాలీవుడ్లో ఇప్పటికే ప్రముఖ క్రేజీ స్టార్స్తో వెబ్ సిరీస్లు నిర్మిస్తూ వరుసగా మార్కెట్లోకి వదులుతున్న నెట్ ఫ్లిక్స్ కన్ను తాజాగా సౌత్ మార్కెట్పై పడింది. ఇప్పటికే చాలా మంది డిజిటల్ రంగం వైపు మళ్లుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈషారెబ్బా, మంచు లక్ష్మి, నిహారిక కొణిదెల, జగపతిబాబు, బిందు మాధవి, నవదీప్ వంటి తారలు చేరిపోగా ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలోకి భానుమతిగా ఆకట్టుకున్న సాయిపల్లవి చేరబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తుంది. ధనుష్ హీరోగా క్యాస్టిజమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రం `అసురన్`. ఈ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్న వెట్రిమారన్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ని రూపొందించబోతున్నారు. దీని ద్వారా సాయి పల్లవి తొలిసారి డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ కాబోతోందని తెలిసింది. మరి అక్కడ ఎన్ని సిత్రాలు చేయనుందో ఈ ఫిదా పోరీ.