నాని హీరోగా తెరకెక్కిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో పరిచయమైన యువ దర్శకుడు నాగ అశ్విన్. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్సులు నేర్చుకొని వచ్చిన నాగ అశ్విన్ తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో నాగ అశ్విన్ ప్రొఫెషనల్ కెరీర్ మాత్రమే కాదు పర్సనల్ కెరీర్ కూడా సెటిల్ అయిపోయింది. తన తొలి చిత్ర నిర్మాతనే వివాహం చేసుకున్నాడు దర్శకుడు నాగ అశ్విన్.
ఎవడే సుబ్రమణ్యం సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్లు కలిసి నిర్మించారు. తొలి సినిమాతోనే డిఫరెంట్ టేస్ట్ ఉన్న నిర్మాతలు పేరు తెచ్చుకున్న ఈ నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్ దర్శకుడు నాగ అశ్విన్తో ప్రేమలో పడ్డారు. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కొద్ది రోజుల పాటు హిమాళయాల్లో జరిగింది. ఆ సందర్భంలోనే నాగ అశ్విన్, ప్రియాంకల మధ్య ప్రేమ చిరుగురించింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపటంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఆ తరువాత ఇదే కాంబినేషన్లో మరో క్లాసిక్ హిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన భార్య నిర్మాణంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కించాడు నాగ అశ్విన్. ఈ సినిమా వీరికి మరో మధురానుభూతిగా మిగిలిపోయింది. ఈ సినిమా వీరి జోడికి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న ఈ సినిమా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం ఈ జంట కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కోసం నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కావాలంటూ చాలా రోజుల క్రితమే ప్రకటించిన నాగ అశ్విన్ ఆ తరువాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఓ భారీ ఫాంటసీ చిత్రాన్ని నాగ అశ్విన్ తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.