డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన వారసుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్న పూరీ, తనయుడికి తొలి సక్సెస్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాతో పాటు తన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కబోయే సినిమాలు కూడా చూస్తున్నాడు పూరి జగన్నాథ్.
ఇప్పటికే విజయ్, పూరీల సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో పూరీ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా లొబాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగా బాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కలిశాడు. అంతేకాదు పూరీ కూడా అడ్డా పేరుతో ముంబైలో ఆఫీన్ను ప్రారంభించి అక్కడి నుంచే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్ కోసం ఓ భారీ సెట్ను రూపొందిస్తున్నారట. దాదాపు 5 కోట్ల రూపాయలతో సెట్ నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ గత చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో విజయ్ సాధించలేదు.
డియర్ కామ్రేడ్ సినిమాకు భారీస్థాయిలో నష్టాలు కూడా వచ్చాయి. తాజాగా రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటనకు ఫుల్ మార్క్స్ పడినా సినిమా కథా కథనాలు పెద్దగా ఆకట్టుకునేలా లేవంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పూరీ ఏ ధైర్యంతో విజయ్ మీద ఇంత భారీగా ఖర్చు పెడుతున్నాడు, అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.