పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు. ఈ సినిమా తరువాత కూడా వరుసగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే క్రిష్, హరీష్ శంకర్ ల దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు.
పింక్ రీమేక్ పూర్తయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కునుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహాలో బందిపోటు పాత్రలో నటిస్తున్నాడట. ఈ పాత్ర కోసం పవన్ క్లిన్ షేవ్ లోకి మారిపోయాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించేందుకు ప్లాన్ చేశారు. క్రిష్ బాలీవుడ్ జనాలకు కూడా సుపరిచితుడు కావటం, పీరియాడిక్ సినిమా అయితే నేటివిటీ సమస్య రాదన్న ఉద్దేశంతో హిందీలోనూ ప్లాన్ చేశారు.
అయితే తాజాగా ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల సైర నరసింహారెడ్డి, సాహో లాంటి పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవటంతో పవన్ సినిమా విషయంలో కూడా ఆలోచనలో పడ్డారట. అందుకే సినిమాను కేవలం తెలుగు లో మాత్రమే తెరకెక్కించి, అవసరమైతే తరువాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.