ప్రస్తుతం సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినిమా, రాజకీయ, క్రీడా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతో మంది జీవితాలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు మన మేకర్స్‌.

 

బయోపిక్‌లకు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ దక్కుతుండటంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అదే బాటలో తెరకెక్కుతున్న మరో క్రేజీ బయోపిక్‌ తలైవి. తమిళనాట సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఏ ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో కాంట్రవర్షియల్ బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ నటిస్తోంది. ఈ సినిమాలో జయలలిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు.

 

జయ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఆమెకు శోభన్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో శోభన్ బాబు పాత్రలో ముందుగా విజయ్‌ దేవరకొండను తీసుకోవాలని భావించారు.

 

కానీ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ బిజీగా ఉండటంతో ఆ పాత్రకు మరో నటుడిని తీసుకున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో నటించిన జిష్షు సేన్‌ గుప్తా తరువాత అశ్వథ్థామ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. సౌత్‌లోనూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న ఈ బెంగాళీ నటుడు తలైవీ సినిమాలో శోభన్‌ బాబు పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో ఎమ్జీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తుండగా కరుణానిధి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: