రాజకీయాల్లో ఫెయిల్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టాడు. పాలిటిక్స్ కు పూర్తిగా బ్రేక్ ఇవ్వకపోయినా.. ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. వరుసగా మూడు సినిమాలను ప్రకటించి అభిమానులను ఖుషీ చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పింక్ రీమేక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్లు అంజలి, నివేదా థామస్లు కీలక పాత్రలలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. రాబిన్ హుడ్ తరహాలో దొంగతనాలు చేసే సాయన్న పాత్రలో పవన్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ క్లీన్ షేవ్లోకి మారిపోయినట్టుగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. పీరియాడిక్ సినిమా కావటంతో అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి భారీగా సెట్ లు నిర్మిస్తున్నారట. కేవలం ఈ సెట్స్ నిర్మాణానికే 30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పవన్ క్రేజ్ దృష్ట్యా ఇంత మొత్తం ఖర్చు చేసినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రిస్క్ ఏమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్లో నటించేందుకు ఓకే చెప్పాడు పవన్.