మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ విజువల్ వండర్ అంజి. సంచలన దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఎంఎస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించాడు. చిరంజీవి సరసన నమ్రతా శిరోద్కర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు టిను ఆనంద్, నాగ బాబు, రామిరెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డిఫరెంట్ బ్యాక్డ్రాప్తో గ్రాఫికల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఏకంగా ఏడేళ్ల పాటు తెరకెక్కించారు.
హీరోగా మెగాస్టార్ కెరీర్ సూపర్ ఫాంలో ఉండగా ఆయనతో ఓ భారీ గ్రాఫికల్ సినిమాను ప్లాన్ చేశాడు కోడి రామకృష్ణ. అందుకోసం ఆత్మలింగం నేపథ్యంలో అద్భుతమైన కథ సిద్ధం చేశాడు. గతంలో అమ్మోరు లాంటి గ్రాఫికల్ చిత్రాలు నిర్మించిన అనుభవం ఉన్న నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సినిమా నిర్మాణ బాద్యతలు కూడా తీసుకున్నాడు. 1997 మేలో సినిమాను అధికారికంగా ప్రకటించిన అక్టోబర్ 10 షూటింగ్ ప్రారంభించారు. అయితే ఈ సినిమా పూర్తి చేయాడానికి చాలా సమయమే పట్టింది.
అందుకు చాలా కారణాలే ఉన్నాయి. కథకు తగ్గ గ్రాఫిక్స్ అందించే సాంకేతికత అప్పట్లో మనకు అందుబాటులో లేకపోవటంతో షూటింగ్ మధ్యలో ఆపి విదేశాల్లో గ్రాఫిక్స్కు సంబంధించి ఎంతవరకు చేయగలం అన్న విషయాలు ఎంక్వయిరీ చేశారు దర్శక నిర్మాతలు. దీంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో చిరు ఇతర సినిమాలు కమిట్ అవ్వటంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అలా ఏడేళ్ల తరువాత ఫైనల్గా 2004 జనవరి 15న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంజి. కథా కథనాలు పాతవి కావటం, దాదాపు ఒక జనరేషన్ గ్యాప్తో సినిమా రిలీజ్ కావటంతో ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే గ్రాఫిక్స్ విభాగంలో జాతీయ అవార్గు అందుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్గించింది అంజి.