కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరికో చిరంజీవి ఒక స్ఫూర్తి. ఎంత మంది హీరోలు వచ్చినా వెళ్లినా మెగాస్టార్ అంటే టాలీవుడ్కి ఎవరెస్ట్ శిఖరం అనే చెప్పాలి. ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ ఫ్యాన్స్ ఖాతాలో చాలా మందే ఉన్నారు. స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు.అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్.
చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. అభిమానులకు గ్యాంగ్ లీడర్ గా.. టాలీవుడ్కు మెగాస్టార్గా తనకంటూ చరిత్రలో ఒక పేజీని నింపుకున్నారు. నలబై ఏళ్ల సినీ కెరీర్ లో ఆయన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ కి పరిచయం లేని ఎన్నో రికార్డ్ లను పరిచయం చేశారు. అయితే 2007లో చిరంజీవి హీరోగా వచ్చిన చిత్రం శంకర్దాదా జిందాబాద్. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. హిందీలో సంజయ్ దత్త్ నటించిన లగే రహో మున్నాభాయ్ సినిమాకు ఇది రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే క్రొత్తగా ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు.
2008 ఆగస్టు 26 న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. అయితే 2011, ఫిబ్రవరి 6 వతేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. ఇక మళ్లీ 2017 అంటే పది సంవత్సరాల తర్వాత ఖైదీ నంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా దాదాపు 105 కోట్లకు పైగా షేర్ రాబట్టి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. పదేళ్లు సినీ రంగానికి దూరంగా ఉన్నా.. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం దగ్గలేదని ఈ చిత్రం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే నాడు.. నేడే కాదు ఎన్నైళ్లైనా మెగాస్టారే అనిపించుకున్నారు.