తెలుగు ఇండస్ట్రీలో 80 దశకంలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది విజయశాంతి. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా అలాంటి పాత్రల్లో నటించడంతో ఆమెపై ఆడియన్స్ విముఖత చూపించారు. అదే సమయానికి ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వెళ్లింది. మొదట బీజెపీ తర్వాత టీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతుంది. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో పదమూడేళ్ల తర్వాత నటించింది.
తాజాగా ఆర్మీలో మహిళలకు.. పురుషులతో సమాన హోదా కల్పిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అందరికీ తెలిసిందే. అయితే ఈ తీర్పుకి సంబందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ అధికారిగా, లెక్చరర్గా, ప్రొఫెసర్గా, లాయర్గా, సీబీఐ అధికారిగా, మహిళా మంత్రిగా, ఆటోడ్రైవర్గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తగా, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమ కారిణిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు మహిళలు. కాగా, ఇరవై ఏళ్ల క్రితం తను 'భారతరత్న' సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారమైందని ఆమె అన్నారు. తను నటించిన బహుభాషా చిత్రం 'భారతరత్న'లో పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర తనతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు.
రెండు దశాబ్దాల క్రితం తను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందన ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే విజయశాంతి తర్వాత ఏ చిత్రంలో నటిస్తారన్న విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.