టాలీవుడ్ లో ఇడియట్ సినిమాతో హీరోగా మారిన రవితేజ తర్వా మాస్ మహరాజ గా పేరు తెచ్చుకున్నాడు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా మారాడు. ఇక వరుస గా విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమాతో బాక్సాఫీస్ విజయం అందుకున్నాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ దుమ్మురేపాడు. ఆ తర్వాత బాబి దర్శకత్వంలో పవర్ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మంచి విజయం అందుకున్నాడు.
ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాతో మరోసారి పోలీస్ లుక్ తో దుమ్మురేపినట్టు నిన్న రిలీజ్ అయిన టీజర్ లో కనిపిస్తుంది. గోపిచంద్ మలినేని గతంలో రవితేజకు బలుపు లాంటి బ్లాక్ బస్టర్ అందించారు. అంతే కాదు ఇందులో హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాత. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'క్రాక్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 'క్రాక్' మూవీ వేసవిలో మే 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ వరుస గా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఈ ఏడాది వి.ఆనంద్ దర్శకత్వంలో రిలీజ్ అయిన డిస్కోరాజా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. కానీ ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ మరో సంచలన విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు మాస్ మహరాజ ఫ్యాన్స్.