టాలీవుడ్ లో ఒకప్పుడు శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పేరు చెపితే అగ్రహీరోలతో వరుసగా ఆ బ్యానర్ పై తీసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ముందుగా దక్షిణ భారతదేశంలో శ్రీ సూర్య మూవీస్ అనేది ఓ పెద్ద సినీ నిర్మాణ సంస్థ అన్నది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం లో జన్మించిన రత్నం ముందుగా సినిమా రంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా ప్రవేశించి ఎన్నో సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోలకు మేకప్ మెన్ గా పనిచేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు.
1992లో వచ్చిన పెద్దరికం సినిమాతో పాటు 1995లో వచ్చిన సంకల్పం సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనంతరం శ్రీ సూర్య మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆయనకు నిర్మాతగా మొదటి సినిమా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన కర్తవ్యం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్తో భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమలను కూడా రత్నం తీశారు. ఇక ఆయన ఇద్దరు కుమారులు ఏఎం. జ్యోతికృష్ణ, ఏఎం. రవికృష్ణ ఇద్దరూ కూడా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు రవికృష్ణ 7జి బృందావన్ కాలనీ సినిమాలో హీరోగా నటించాడు. ఆయన మరో కుమారుడు జ్యోతికృష్ణ గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ సినిమాకు దర్శకుడు.
ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రత్నం మధ్యలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అయితే స్టార్ హీరో అజిత్ ఇచ్చిన అండదండలతో ఆయన తిరిగి నిలదొక్కుకుని మళ్లీ దూసుకు వెళుతున్నారు. అయితే ఆయన ఇద్దరు కుమారులు మాత్రం హీరోగా, దర్శకులుగా ఎంట్రీ ఇచ్చినా అంచనాలు అందుకోలేకపోయారు.