డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది నటించిన `సాహో` చిత్రం తెలుగులో పెద్దగా ఆశించినంత ఫలితం రాకపోయినప్పటికీ.. బాలీవుడ్లో మాత్రం ఈ చిత్రం సంచలనం సృష్టించిందనే చెప్పాలి. విడుదలైన తొలిరోజే బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలకొట్టింది. దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ బిజినెస్ అవార్డులు 2019కి గానూ సాహో చిత్రాన్ని ‘హైయ్యెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డును’ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం సౌత్లో ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోయినా.. నార్త్ లో ఆడియన్స్కి బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం హిందీ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాడు ప్రభాస్.
జిల్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పటివరకు ఈ చిత్రం షూటింగ్ దాదాపు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. ఈసారి పక్కాగా హిట్ కొట్టి తీరాలి అనే టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే పాన్ ఇండియా రిలీజ్ అనే ప్లాన్తో రూపుదిద్దుకుంటున్న ఆ సినిమా తెలుగు, హిందీ వెర్షన్స్ సెపరేట్ గా షూట్ చెయ్యబోతున్నారు. తెలుగు వెర్షన్లో కొన్ని సీన్స్ స్పెషల్గా డిజైన్ చేశారట. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 130 కోట్ల రూపాయలతో.. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా వస్తోంది.
మరి ఈ చిత్రంతో ప్రభాస్ ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో వేచి చూడాలి. ఈ మధ్య పూర్తి లవ్స్టోరీస్లో ప్రభాస్ నటించి చాలా కాలం అయిందని చెప్పాలి. ఈ సినిమాతో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడని చాలా నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ వారం ప్రభాస్ అప్డేట్స్ ఇవే.