తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది త్రిష. అప్పట్లో ఎన్నో గ్లామర్ పాత్రలో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది. తనలోని నటిని అందరికీ పరిచయం చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తుంది ఈ అమ్మడు. ముఖ్యంగా విజయ్ సేతుపతి తో నటించిన 96 సినిమా ఈ అమ్మడికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఈ సినిమాలో త్రిష నటనకుగాను ఎన్నో ప్రశంసలు కూడా దక్కాయి. అయితే తాజాగా త్రిష చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. త్రిష ఇటీవలే దర్శకనిర్మాత తీరుజ్ఞానం తెరకెక్కించిన పరమపదం  విళైయాట్టు  చిత్రంలో నటించింది. అయితే ఈ మధ్య కాలం లో హీరోయిన్ ఎవరు ప్రమోషన్స్ కోసం అంతగా హాజరు కావడం లేదు. సినిమా చేసి ఆ తర్వాత సైలెంట్ గా ఉండిపోతున్నారు. త్రిష కూడా ఈ సినిమా విషయంలో అదే చేసింది.

 

 

అయితే సినిమా ప్రమోషన్స్ కి త్రిష హాజరు కాకపోవడంపై తమిళ నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. త్రిష నటించిన సినిమా ఈ నెల 28న విడుదల కానుండగా... చెన్నైలోని సత్యం థియేటర్లో చిత్ర యూనిట్ ఓ  కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా  నటుడు భాగ్యరాజా తమిళ నిర్మాతల మండలి నుంచి పలువురు నిర్మాతలు పాల్గొన్నారు. అయితే ఈ సినిమాకు త్రిష మాత్రం హాజరు కాలేదు. అయితే ఈ సినిమాలో త్రిష ప్రధాన పాత్రధారి కావడంతో.. ఆమె గైర్హాజరుపై పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటూ త్రిషకు అల్టిమేటం జారీ చేసిన నిర్మాత శివ... ఒకవేళ ప్రమోషన్ కార్యక్రమాలకు రాకుంటే పారితోషికంలో సగం తిరిగి ఇచ్చేయాలి అంటూ హెచ్చరించారు. లేని పక్షంలో తమిళ సినిమాలో నటించకుండా నిషేధం విధిస్తామని అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్  లాంటి స్టార్ హీరోల తమ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు హీరోయిన్లు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని... ఇక నుంచి అందరూ హీరోయిన్లు ప్రమోషన్స్ హాజరు కావాల్సిందే అంటూ నిర్మాతలు తెలిపారు. మీరు ప్రమోషన్స్ కి వస్తే సినిమాకు ఉపయోగపడుతుందని మిమ్మల్ని తీసుకుంటామని... లేనిపక్షంలో కొత్త వాళ్లతోనే సినిమాలు తీస్తాము  కదా అంటూ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: