టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత దశాబ్ద కాలంలోనే ప్రస్తుతం ఉన్నంత ఫామ్‌లో ఎప్పుడు లేడనే చెప్పాలి. వరస ఫ్లాపుల తర్వాత శ్రీమంతుడు సినిమా నుంచి మహేష్ కెరీర్ ఒక్కసారిగా ఫుల్ స్వింగ్ అందుకుంది. భరత్ అనే నేను -  మహర్షి సినిమాల‌తో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు లాంటి వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మహేష్ దూసుకుపోతున్నాడు. ఈ మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మ‌హేష్ నెక్ట్స్ ఎలాంటి సినిమా ఎంచుకుంటాడా ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది.



ఇక తాజా అప్ డేట్ ప్రకారం గత రెండు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు, మహేష్ అభిమానులు కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. దానికి కారణం అందరూ త్వరలో పట్టాలెక్కేస్తుంది అనుకున్న వంశీ పైడిపల్లి సినిమా ప్రస్తుతానికి ఆగిపోవడం. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి అటు మ‌హేష్‌బాబుతో పాటు ఇటు నిర్మాత దిల్ రాజుతో ఓ గేమ్ ఆడి... ఇద్ద‌రితోనూ సినిమా ప‌రంగా ఓకే చెప్పించుకున్నాడ‌ట‌.



ఓ గ్యాంగ్ స్ట‌ర్ క‌థ రెడీ చేస్తున్నాన‌ని వంశీ చెప్ప‌డంతో రాజు, మ‌హేష్ ఇద్ద‌రూ ప‌ట్టించుకోలేదు. తీరా క‌థ విన్నాక ఇద్ద‌రికి మైండ్ బ్లాక్ అయ్యింద‌ట‌. ఇక ఈ సినిమా దాదాపు క్యాన్సిల్ అయ్యింద‌న్న టాక్‌తో మ‌హేష్‌కు మ‌రో కొత్త ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌డం.. అది కూడా ఆగిపోవ‌డం.. ఇప్పుడు అటూ ఇటూ తిరిగి  ఫైనల్ గా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కి కాల్ వెళ్ళింద‌ట‌. అయితే ఇప్పుడు ప‌ర‌శురాం 14 రీల్స్ బ్యాన‌ర్లో నాగ‌చైత‌న్య‌తో ఓ ప్రాజెక్టు ఖ‌ర్చీప్ వేసి ఉన్నాడు.



అయితే ఇప్పుడు మ‌హేష్ ప‌ర‌శురాంకు కాల్ చేసి అర్జెంటుగా క‌థ రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. అన్నీ కుదిరితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశం ఉంది. ఏదేమైనా నెక్ట్స్ సినిమా విష‌యంలో మ‌హేష్ క‌న్‌ఫ్యూజ‌న్‌కు ఆయ‌న అభిమానులు సైతం గంద‌ర‌గోళంలోనే ఉన్నారు. వ‌రుస హిట్లు ఉన్నా మ‌హేష్‌కు స‌రైన డైరెక్ట‌ర్ దొర‌క‌ని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: