మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్. పోస్టర్ రిలీజ్ కు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బూస్టప్ ఇవ్వడంతో వైష్ణవ్ కు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇక మెగా ఫ్యాన్స్ అండదండలు ఎలానూ ఉంటాయి కాబట్టి సినిమా జనాల్లోకి వెళ్లడం అంత కష్టమేమీ కాదు. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ పై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

 

 

ఈ సినిమాకు మైత్రీ మూవీస్ వారు ఎక్కువ ధరకే కోట్ చేస్తున్నారని వినికిడి. ఎంత మెగా ఫ్యాన్స్ అండదండలుంటే మాత్రం తొలి చిత్ర హీరోకు ఇంత పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట. హీరోకు తొలి సినిమానే అయినా మంచి రొమాంటిక్ మూవీ అవుతుందని నిర్మాతలు అంటున్నారట. సినిమాను స్వయంగా  చేసుకునేందుకు కూడా వారు వెనెకాడటం లేదని అంటున్నారు. సుకుమార్ సమర్పణలో ఈ సినిమాను దర్శకుడు జాగ్రత్తగా తీసాడని సినిమా హిట్ గ్యారంటీ అంటున్నారట నిర్మాతలు. సినిమాకు కొత్త దర్శకుడు కూడా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కొంత సంశయిస్తున్నారట.

 

 

సినిమాకు తమిళ నటుడు విజయ్ సేతుపతి నటన చాలా ప్లస్ అవుతుందని టీమ్ గ్యారంటీగా చప్తున్నారు. రాయనం పాత్రలో అతని విలక్షణ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటున్నారు. జాలరుల నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతుందని అంటున్నారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు వైష్ణవ్ తేజ్ తమ్ముడవుతాడు. పవన్ కల్యాణ్ జానీలో, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల్లో వైష్ణవ్ తేజ్ బాలనటుడిగా నటించాడు. ఈ సినిమా ఏమేరకు ఫలితం రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: