అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్నివిడిచి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికే ఆమెను మరిచిపోలేకపోతున్నారు ప్రేక్షకులు. భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల రాశి దాదాపు మూడు తరాల నటులతో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 80లలో సౌత్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి, 90లలో బాలీవుడ్ ను మకుటం లేని మహారాణిగా ఏలింది. అందుకే శ్రీదేవి ఇండియన్ స్క్రీన్ మీద ఎవర్గ్రీన్ సూపర్ స్టార్.
తన సుధీర్ఘ సినీ కెరీర్ లో మూడు తరాల హీరోలతో సినిమాలు చేసింది శ్రీదేవి. ముఖ్యంగా తెలుగులో రెండు జనరేషన్ లలో ఆమె టాప్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్లతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ భామ. ఆ తరువాత కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తరువాత జనరేషన్తో కూడా సినిమాలు చేసింది శ్రీదేవి. అదే సమయంలో బాలీవుడ్లోనూ అడుగుపెట్టి అక్కడ కూడా టాప్ స్టార్లందరితో కలిసి నటించింది. ఒక జనరేషన్ మొత్తానికి ఆమె కలల రాకుమారి అని చెప్పటంలో ఏ మాత్రం అతిషయోక్తి లేదు.
ఈ జనరేషన్కు సుపరిచితులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లతోనూ సినిమాలు చేసింది. చిరంజీవితో శ్రీదేవి చేసిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సంచలనం సృష్టించింది. అయితే అదే జనరేషన్ లో మరో టాప్ హీరో బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు శ్రీదేవి. అందుకు రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవితో జంటగా సినిమా చేసేందుకు అంగీకరించలేదట. మరో కారణం కూడా ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించిన ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన వివాదం కారణంగానే తరువాత బాలకృష్ణలో నటించేందుకు శ్రీదేవి అంగీకరించలేదన్న టాక్ కూడా ఉంది.