బాలనటిగా కెరీర్ ప్రారంభించి తరువాత ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటి శ్రీదేవి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది ఈ అతిలోక సుందరి. దాదాపు 30 ఏళ్ల పాటు వెండితెర మీద మహారాణిగా వెలుగొందిన శ్రీదేవి తను హీరోయిన్ గా నటించిన ఓ సినిమా సూపర్ హిట్ అయినందుకు ఎంతో బాధపడింది. అంతేకాదు ఆ విషయాన్ని తనే స్వయంగా మీడియాకు వెళ్లడించింది.
అందాల తార శ్రీదేవి హీరోయిన్ గా 1983లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ హిమ్మత్ వాలా. టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు బాలీవుడ్ లో తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీదేవి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ సినిమాలో జితేంద్ర హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తన బ్యాడ్ లక్ అని శ్రీదేవి ఓ సందర్భంలో చెప్పారు. 1987లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీదేవి. `తమిళ చిత్రాల్లో నా నటన సహజంగా ఉండాలని దర్శకులు, అభిమానులు అభిప్రాయపడేవారు.
కానీ హిందీ చిత్రాల్లో అలా కాదు. వారికి గ్లామర్ పాత్రలు మాత్రమే కావాలి. నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను బాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టాక `హిమ్మత్ వాలా`తో తొలి విజయం అందుకున్నాను. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సద్మా సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించాను. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. దాంతో బాలీవుడ్ డైరెక్టర్లు నన్ను కేవటం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితం చేశారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని `శ్రీదేవి; ది క్వీన్ ఆఫ్ హార్ట్స్` అనే పుస్తకంలో రచయిత వివరించారు. ఈ రోజు శ్రీదేవి రెండో వర్థంతి సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.