భారతీయ సినీ పరిశ్రమను ఏలిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు శ్రీదేవి. అందము, అభినయం, నటన మున్నగువాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయకగా గుర్తింపు సంపాదించింది. ఆగస్టు 13వ తేది 1963లో తమిళనాడు రాష్ట్రం లోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి.. 1967లో కన్దన్ కరుణాయ్ సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. అలా కెరీర్ ను స్టార్ట్ చేసినామో అనతికాలంలోనే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాలలో నటించింది. ఇక 54 ఏళ్ల వయసులోనే ఈ అతిలోక సుందరి అనంత లోకాలకు వెళ్లిపోయినా.. ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధుర జ్ఞాపకాలు ఎన్నటికీ తరగనివి.
ఇక ఈ అతిలోకసుందరి అనంతలోకాల్లో కలిసిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పటికీ శ్రీదేవి ఇక లేరన్న నిజాన్ని ఆమె కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. పాతికేళ్ల క్రితమే తెలుగు చిత్రసీమను విడచి బాలీవుడ్లో స్థిరపడినా, తెలుగు ప్రేక్షకుడు ఆమెను మరిచిపోయింది లేదు. ఇక శ్రీదేవి అంటే ఓ అందాల తార. దివి నుంచి భువికి దిగొచ్చిన ఓ దేవకన్య. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు చూస్తే అతిలోక సుందరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. అవన్నీ కూడా ఊహకందని ఓ అగాథాన్ని... ఓ కల్లోలాన్ని గుర్తు చేస్తాయి.
అపురూపమైన ఆ సౌందర్యం వెనక శ్రీదేవి ఇంత వేదనని దాచుకొందా అనిపిస్తుంది. ఇక శ్రీదేవి తండ్రి పేరు అయ్యప్పన్, ఆయన ఒక న్యాయవాది. తల్లి పేరు రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అను ఒక సోదరి, సతీష్ అను సోదరుడు ఉన్నారు. అయితే ఒకసారి హాస్పటల్లో ఆమె తల్లికి బ్రెయిన్ సర్జరీ జరుగుతున్నా.. శ్రీదేవి మాత్రం ఆ బాధను దిగమింగుకుని నిర్మాత నష్టపోకూడదని `దేవరాగం` అనే సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు శ్రీదేవి పడిన బాధ వర్ణతీతం. 1996 భరతన్ దర్వకత్వంలో వచ్చిన దేవరాగం అనే మలయాళ సినిమాలో అరవింద్ స్వామి సనసన శ్రీదేవి నటించింది. ఈ చిత్రం యొక్క తమిళ డబ్ వెర్షన్ కూడా విడుదలైంది.