యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన జోరుగా కొనసాగింది. ఇందులో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు సందర్శించారు. ‘తాజ్’ అందాలను వీక్షిస్తున్న ట్రంప్ ఫ్యామిలీకి, చారిత్రక కట్టడం వివరాలను, విశిష్టత గురించి వారి వెంట ఉన్న గైడ్స్ వివరించి చెప్పారు. ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక, అల్లుడు కుష్నర్ లు ఆసక్తిగా చూస్తూ... ఫోటోలు తీయించుకున్నారు. ఇక 'నమస్తే ట్రంప్' సభలో మోడీ, ట్రంప్ లు ఒకరిని మించి మరొకరు ఒకరి గురించి ఒకరు పొగుడుకున్నారు. గుజరాత్ మాత్రమే కాదు యావత్ దేశం ట్రంప్కు స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు.
ఇక ప్రధాన మోదీ గురించి అమెరికా అధ్యక్షులు ట్రంప్ మాట్లాడుతూ.. తన నిజమైన మిత్రుడని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. తాజాగా భారత్ లో ట్రంప్ పర్యటనపై పలువురు సెలబ్రెటీలు స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూ స్పందించారు. ట్రంప్, మోదీలను ఉద్దేశించి అబ్బో వీరిద్దరి భలే జోడీ అంటూ ఎద్దేవా చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఓ వర్గం ప్రజలను వేరు చేసేందుకు గోడ కట్టారని ట్రంప్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత మెక్సికో నుంచి అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ గోడ నిర్మాణానికి నడుంబిగించడం తెలిసిందే.
మోదీ గురించి ప్రస్తావిస్తూ.. తన వైఫల్యాలు కప్పిపుచ్చు కునేందుకు ఈయన కూడా ఓ గోడ కట్టారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని అందరూ గమనిస్తునే ఉన్నారని అన్నారు. కాగా, మొతేరా మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డంగా గోడలు నిర్మించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఖుష్బూ ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశార. మొత్తానికి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రక రకరకాల చర్చలు నడుస్తున్నాయి.