సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన ప్రేమకథ ప్రభుదేవా నయనతారలది. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల దాకా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయింది. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ప్రభు - నయన్లు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. ఎవరి దారి వారు చూసుకున్నారు. కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన 'విల్లు' చిత్రం సందర్భంగా నయనతార, ప్రభుదేవా మధ్య ప్రేమ మొదలైంది. శింబుతో బ్రేకప్ అయిన తర్వాత అప్పుడప్పుడే మానసికంగా కోలుకున్న నయనతార ప్రభుదేవాకు దగ్గరైంది. అయితే అప్పటికే ప్రభుదేవాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నయనతారతో పెళ్లి కోసమే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. అప్పట్లో ఈ పరిణామాలు పెద్ద దుమారామే రేపాయి. నయనతార కూడా ఇక సినిమాలకు గుడ్బై చెప్పేయాలని నిర్ణయించుకుంది. శ్రీరామ రాజ్యం షూటింగ్ పూర్తయిన సందర్భంగా సినిమాలకు దూరమవుతున్నందుకు కన్నీరు పెట్టుకుంది. క్రిస్టియన్ అయిన నయన, ప్రభుదేవా కోసం మతం కూడా మార్చుకోవాలని నిర్ణియించుకుంది. ఇక పెళ్లే అనుకుంటున్న సమయంలో వారు విడిపోవటం అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది.
ఈ బ్రేకప్ గురించి నయనతార ఇంతవరకు స్పందించలేదు. కానీ ప్రభుదేవా మాత్రం ఒక సందర్భంలో మాట్లాడాడు. `ప్రేమ అంటే నాకిప్పటికీ గౌరవం ఉంది. అయితే అన్ని ప్రేమకథలూ సుఖాంతం కావు. నాదీ అంతే. ప్రేమలో పడడం, అందులో విఫలం అవ్వడం కూడా ప్రేమలో ఒక భాగంమనే అనుకుంటున్నా. అయ్యిందేదో అయ్యింది. దాని గురించి నేనేం చింతించడం లేదు. నిజానికి అంత టైమ్ కూడా లేదు. నా పర్సనల్ లైఫ్ నాకుంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నాను` అంటూ నయన్తో బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు ప్రభుదేవా.
అంతేకాదు.. సృష్టిలో అందరికీ ఏదో ఓ రూపంలో బాధలు వెంటాడుతుంటాయని, సంపూర్ణ ఆనందంతో ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఉండరని, అలాంటి వ్యక్తి ఎదురైతే.. తప్పకుండా అతనికి సలాం కొట్టి, సహాయకుడిగా మారిపోతానని అంటున్నాడు ప్రభుదేవా. అయితే ఇద్దరూ ఎందుకు విడిపోయారో, అసలు కారణం ఏమిటన్నది ప్రభుదేవా చెప్పడం లేదు.