సినీ రంగంతో అనుబంధాన్ని ఎవరు అంత ఈజీగా వదులుకోలేరు. అందుకే తాము ఇండస్ట్రీకి దూరమైనా తమ వారసులను తెరకు పరిచయం చేసిన ఆనందపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్లు కూడా తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాల నటులుగానే తమ పిల్లలను వెండితెర మీద చూపించి మురిసిపోతున్నారు. నిన్నటి తరం హీరోయిన్లు చాలా మంది తమ వారసులను ఇప్పటికే వెండితెరకు పరిచయం చేశారు.
ఈ లిస్ట్లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ నమత్రా శిరోద్కర్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్కు వచ్చిన ఈ ముద్దుగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయిపోయింది. భవిష్యత్ సూపర్ స్టార్కు తల్లి ఇప్పటి నుంచే తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమాతో తన వారసుడు గౌతమ్ను వెండితెరకు పరిచయం చేసింది సూపర్ స్టార్ ఫ్యామిలి.
మరో హీరోయిన్ లయ కూడా తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేసింది. వరుసగా అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్లతో ఆట్టుకున్న లయ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫారిన్లో సెటిల్ అయ్యింది. అయితే ఇటీవల పూర్తిగా ఫారిన్లో చిత్రీకరణ జరుపుకున్న అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో తన కూతురు శ్లోకాను వెండితెరకు పరిచయం చేసింది.
మరో సీనియర్ నటి మీనా కూడా తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేసింది. బాలనటిగానే ఇండస్ట్రీకి వచ్చిన మీనా, తన కూతురిని కూడా బాలనటిగా పరిచయం చేసింది. కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి సినిమాలో మీనా కూతురు నైనికాను వెండితెరకు పరిచయం చేసింది. ఈ సినిమాలో నైనికా నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
వీళ్లే కాదు నిన్నటి తరం హీరోయిన్ లిజి కూడా తన వారసురాలిని వెండితెరకు పరిచయం చేసింది. తెలుగులో 20 వ శతాబ్దం, మహర్షి లాంటి సినిమాల్లో నటించిన లిజి తన కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ను సినీ రంగానికి పరిచయం చేసింది. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది కళ్యాణి.