లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా సౌత్ ఇండియా గ్రేట్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న భారీ చిత్రం ఇండియన్ 2. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లోకేషన్లో భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా దర్శకుడు శంకర్ సహా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదంతో ఉలిక్కి పడ్డ కోలీవుడ్ దర్శక నిర్మాతలు తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తల తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు ఓ అల్టిమేటం జారీ చేశాడు. ఇక మీదట సినిమా షూటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోకేషన్లో ఏర్పాటు చేసిన సేఫ్టీ మేజర్స్ ఏంటి లాంటి వివరాలను తనకు తెలియజేసిన తరువాతే షూటింగ్ ప్రారంభిస్తానని కమల్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే లైకా సంస్థ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అని తెలుసుకోవటంతో పాటు భవిష్యత్తులో ఇక మీదట అలాంటివి జరగ కుండా చర్యలు తీసుకుంటోంది.
అయితే ఇతర చిత్రాల నిర్మాతలు కూడా ఈ సంఘటనతో ఉలిక్కి పడ్డారు. తాజాగా శింబు హీరోగా మానాడు సినిమాను నిర్మిస్తున్న నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సినిమా సెట్లో పనిచేసే అందరికీ ఇన్స్యూరెన్స్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు సురేష్ కమాట్చి. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఈ ఇన్స్యూరెన్స్ వర్తించనుంది. దాదాపు 30 కోట్లకు ఇన్స్యూరెన్స్ చేసినట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
శింబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఇటీవలే ప్రారంభమైంది. వెంటక్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు కు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తోంది.