బాహుబలి సినిమా తో తెలుగు స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ చిత్రం తర్వాత జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్పై భారీ అంచనాలు ఉన్నాయి. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో రాంచరణ్కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్కు జోడీగా హాలీవుడ్ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని తొలుత జూలై 30, 2020న దేశంలోని పది భాషలలో రిలీజ్ చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత రాజమౌళి కొన్ని హింట్లు ఇవ్వడంతో సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.
ఇక అదే నిజం చేస్తూ.. జక్కన్న ఈ సినిమాను 2021 జనవరి 8 కి వాయిదా వేశారు. షూటింగ్ ఆలస్యం కావడానికి రాజమౌళి టేకింగ్, పెర్ఫెక్షన్ వల్ల జరిగిన ఆలస్యం అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా ఒక హాలీవుడ్ నటుడు గాయపడ్డాడట. రామ్ చరణ్ తో ఈ నటుడికి చాలా సీన్లు కాంబినేషన్ ఉన్నాయిట. ప్రస్తుతం ఆ నటుడు కోలుకుంటున్నాడని, దీంతో చేసేదేం లేక చిత్రాన్ని తర్వాత సూటబుల్ డేట్ చూసుకుని జనవరి 8 అని ఫిక్స్ అయ్యి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కాగా, మొత్తం 10 భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు.