సీఎం జగన్ ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కలిశారు. హుద్ హుద్ తుపాను బాధితుల కోసం సినీ పరిశ్రమవారు నిర్మించిన ఇళ్లను ప్రారంభించాలని వారు జగన్ ను కోరారు. అందుకు జగన్ అంగీకరించారని సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ చెప్పారు. హుద్ హుద్ తుపానులో ఇళ్లు కోల్పోయిన వారికోసం తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల పాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేసి విరాళాలు సేకరించింది. తద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది.

 

అలా విరాళాలతో వచ్చిన డబ్బుతో విశాఖలోని మధురవాడ సమీపంలో 320 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. వాటిని ప్రభుత్వానికి అందచేస్తారు. ఈ కార్యక్రమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది.

 

భేటీ తర్వాత అగ్ర నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించి హుద్‌హుద్‌ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

 

దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్‌ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని అగ్ర నిర్మాతలు చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. సినీ ప్రముఖుల విజ్ఞప్తిని సీఎం వైఎస్ జగన్ అంగీకరించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: