టాలీవుడ్ లో ఈ మద్య యువ దర్శకులు తమ హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్స్ కి కాంపిటీషన్ గా మంచి కంటెంట్ తో హిట్స్ అందుకుంటున్నారు. ఆ మద్య తరుణ్ భాస్కర్, సందీప్ వంగా, అజయ్ భూపతి, సంకల్ప్ రెడ్డి వీరి తీసింది ఒక్క సినిమానే అయినా.. ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తెరకెక్కించారు. ‘ఘాజీ, అంతరిక్షం’ సినిమాలతో యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ తన మూడో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.. కాకపోతే అది బాలీవుడ్ లో అని తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో సంప్రదింపులు అయినట్లు సమాచారం.
ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఘాజీ మూవీతో నేషనల్ స్టార్ డం పొందిన ఈ యువ దర్శకుడు చివరిగా అంతరిక్షం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న సంకల్ప్ రెడ్డి ఏకంగా బాలీవుడ్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధం కావడం మనోడు మంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది. విద్యుత్ జమాల్ హీరోగా ఓ సినిమా తీయడానికి కథ సిద్ధం చేయమని విద్యుత్ తండ్రి సంకల్ప్ని కోరారట.
ఆ కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారట సంకల్ప్. తమిళ్ హీరో విజయ్ నటించిన కత్తి, ఎన్టీఆర్తో శక్తి, సూర్యతో సికిందర్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమాల్. మార్షల్ ఆర్ట్స్ లో పట్టభద్రుడైన ఈ హీరో ప్రస్తుతం కమాండో సీరీస్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇదే కాక మరో బాలీవుడ్ మూవీని తెరకెక్కించేందుకు కూడా సంకల్ప్ సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.