ఇప్పుడు తెలుగులో మల్టీస్టారర్స్ సినిమాలు బాగానే వస్తున్నాయి. అందులో ఎన్టీఆర్, చరణ్ లాంటి హీరోలు కూడా కలిసి నటిస్తున్నారు. అయితే.. తాజాగా చిరంజీవి, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని తెలిసిన తర్వాత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొరటాల శివ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నక్సలైట్ పాత్రలో చిరు నటిస్తున్నాడని తెలుస్తుంది. మొన్న లీక్ అయిన స్టిల్స్ చూసిన తర్వాత అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

 

 

ఈ పాత్ర కోసం మహేష్ బాబు కాస్త బరువు కూడా తగ్గుతున్నాడు. చాలా ఎమోషనల్‌గా ఉండే ఈ కారెక్టర్ సినిమాలో 25 నిమిషాలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. దీనికోసం భారీగా పారితోషికం అందుకుంటున్నాడు సూపర్ స్టార్. కొరటాల శివపై ఉన్న నమ్మకం.. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నాడు మహేష్. అయితే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని.. ముఖ్యంగా కథలో మహేష్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మహేష్ బాబు ఉండే 25 నిమిషాల్లో దాదాపు 20 నిమిషాల పాటు చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ జోడీగా పూజా హెగ్డే కనిపించబోతుంది.

 

 

ఇదిలా ఉంటే మహేష్ కారెక్టర్ ఈ సినిమాలో చనిపోతుందని.. అక్కడ్నుంచి సినిమా రేంజ్ కూడా మారిపోతుందని తెలుస్తుంది. మహేష్ కారెక్టర్ అయిపోయిన తర్వాత చిరంజీవి వెళ్లే దారి సినిమా రేంజ్ పెంచేస్తుందని వార్తలొస్తున్నాయి. మహేష్ లాంటి సూపర్ స్టార్ కారెక్టర్ చనిపోవాలంటే కథలో ఎంత దమ్ముండాలి.. దాన్ని ఒప్పుకోవాలంటే మహేష్ ఎంత ధైర్యం చేసుండాలి.. 

 

 

ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు కొరటాల శివ. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. ఆగస్ట్ 14న సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు కొరటాల. ఈ సినిమా కోసం 30 రోజుల డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాల తర్వాత మరోసారి కొరటాలతో వర్క్ చేస్తున్నాడు సూపర్ స్టార్. మరి చూడాలిక.. ఈ మెగా కాంబినేషన్ ఎలా ఉండబోతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: