బాహుబలి తరువాత అదే స్థాయిలో సక్సెస్ అయిన సౌత్ సినిమా కేజీఎఫ్. సినిమా క్వాలిటీ విషయంలో సాండల్వుడ్ ఎంతో వెనకపడి ఉందన్న పేరును చెరిపేస్తూ సౌత్ సినిమా స్థాయిని మరో మెట్లు ఎక్కించిన సినిమా ఇది. యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఒక్కసారిగా యష్, ప్రశాంత్ నీల్లు జాతీయ స్థాయిలో స్టార్లుగా మారిపోయారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా కేజీఎఫ్ 2 చిత్రీకరణ జరుగుతోంది. తొలి భాగం సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాను మరింత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తుండగా సీనియర్ నటి రవీనాటండన్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ ఓ తెలుగు హీరోతో సినిమా చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడన్న టాక్ సౌత్లో హల్చల్ చేస్తోంది.
కొద్ది రోజులు క్రితం కేజీఎఫ్ టీం హైదరాబాద్లో సందడి చేసింది. కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ప్రశాంత్ నీల్ పలువురు సీనియర్ హీరోలను కలిశాడన్న ప్రచారం కాస్త గట్టిగానే జరిగింది. ముఖ్యంగా మాస్ హీరోగా తిరుగు లేని ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడన్న వార్త అప్పట్లో టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తరువాత మహేష్ బాబుతో ప్రశాంత్ సినిమా అన్న టాక్ మరింతగా ప్రచారమైంది. మహేష్ ఇమేజ్కు తగ్గ పవర్ఫుల్ కథను ప్రశాంత్ తయారు చేశాడని, కేజీఎఫ్ 2 పూర్తయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళుతుందన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.