సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడెవరన్న విషయంలో ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకొని ఫ్యామిలీ కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లిన మహేష్, ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ సందర్భంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్టుగా తెలుస్తోంది. వంశీ సినిమాను పక్కన పెట్టేశాడట సూపర్ స్టార్. మరో దర్శకుడి సినిమాను పట్టాలెక్కించే ప్లాన్లో ఉన్నాడట. గతంలో గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సినిమా చేసేందుకు మహేష్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు అదే సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఇటీవల ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంలో మహేష్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. సూపర్ హిట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు విద్యార్థి నాయకుడిగా కీలక పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో మహేష్కు జోడిగా క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహర్షి సినిమాలో మహేష్ పూజా కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా ఆచార్య, గోవింద ఆచార్య అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటిస్తోంది.