టాలీవుడ్లో మరో నెల చరిత్రలో కలిసిపోయింది. 2020 సంవత్సరం టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. ముందుగా జనవరి నెలలో అతి పెద్ద సీజన్ అయిన సంక్రాంతి పండుగకు ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠ పురంలో సినిమాలు 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలోనే రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన సినిమాలు రికార్డులకు ఎక్కిన ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటాపోటీగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టడం ఉండటం విశేషం.
ఇక సంక్రాంతి సీజన్ తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఒక్కటీ సినిప్రియులను అలరించలేదు. రవితేజ డిస్కో రాజా, విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్, శర్వానంద్ - సమంత జాను ఇలా అన్నీ వచ్చినా ఏ ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత గ్యాప్ తో మహా శివరాత్రి కానుకగా వచ్చిన నితిన్ - రష్మిక భీష్మ సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకుంది.
భీష్మ కథాకథనాల సంగతెలా ఉన్నా.. సింపుల్ గా ఉంటూనే సరదాగా సాగిపోయే సన్నివేశాలు.. ప్రేమ సన్నివేశాలు.. రొమాంటిక్ సీన్లు.. ఆహ్లాదంగా ఉన్న కామెడీ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాను ఫ్యామిలీతో సహా థియేటర్లకు వెళ్లి మరీ ఎంజాయ్ చేసి రావచ్చు. సంక్రాంతి సినిమాల తర్వాత మళ్లీ భీష్మ మాత్రమే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాగా నిలిచింది. కథ, కథనాలతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైనింగ్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
దర్శకుడు వెంకీ కుడుములకే ఈ క్రెడిట్ నూటికి నూరుశాతం ఇవ్వాలి. ఈ తరం యూత్ ఎలాంటి మాటలతో జోకులు వేసుకుంటారో ? ఎలా సెటైర్లు వేసుకుంటారో ? వెంకీ ఆ పదాలతోనే కామెడీ క్రియేట్ చేశాడు. ఇక వెన్నెల కిషోర్ను ఇటీవల ఈ రేంజ్లో వాడుకున్నది వెంకీ మాత్రమే. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కడుపుబ్బా నవ్వుకుంటూ పొట్ట చెక్కలయ్యే కామెడీ ఎంజాయ్ చేయాల్పిందే. ఈ క్రమంలోనే హెరాల్డ్ బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు FEB 2020కు భీష్మ సినిమా సొంతమైంది. ఈ క్రెడిట్లో మేజర్ భాగమైన డైరెక్టర్ వెంకీ కుడుములతో పాటు టోటల్ సినిమా యూనిట్కు ఇండియా హెరాల్డ్ వసుధైక కుటుంబం తరపున అభినందనలు.