సినిమా అనేది ఎంతో మంది కలిసి చేయాల్సి పని, అలాంటి సమయాల్లో చిన్న చిన్న సమస్యలు రావటం అనేది కామన్. అయితే ఒక్కొసారి ఆ సమస్యలు కాస్త పెద్దవి అవుతుంటాయి. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు దర్శకుడు, హీరోల మధ్య తలెత్తితే సినిమా భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే ఓ తమిళ సినిమా విషయంలో తెర మీదకు వచ్చింది. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా విషయంలో వివాదం తెలెత్తటంతో ఆ సినిమా దర్శకుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో విశాలే దర్శకత్వ బాధ్యతను కూడా భుజానికెత్తుకున్నాడు.
అసలు విశాల్ దర్శకుడవ్వాలనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కానీ అనుకోకుండా హీరోగా సక్సెస్ అయ్యాడు. అయితే ఇన్నాళ్లకు ఓ వివాదం కారణంగా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది విశాల్కి. విశాల్ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా డిటెక్టివ్. ఈ సినిమా ఘన విజయం సాదించటంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను రూపొందిస్తున్నారు. అయితే సీక్వెల్ నిర్మాణం సందర్భంగా హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి.
దీంతో దర్శకుడు మిస్కిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. మిస్కిన్ బయటకు వెళ్లిపోవటంతో ఆపధర్మ దర్శకత్వ బాధ్యతలు విశాల్ నెత్తిమీద పెట్టుకుని సినిమా పూర్తి చేస్తున్నాడట. అయితే మిస్కిన్ కారణంగానే వివాదం మొదలైనట్టుగా కోలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ముందుగా సినిమాకు 40 కోట్ల బడ్జెట్తో పూర్తి చేస్తానని చెప్పిన మిస్కిన్, సంగం సినిమా కూడా పూర్తి కాకుండానే 40 కోట్లు ఖర్చు చేశాడని, అందుకే విశాల్ మిస్కిన్ను తప్పించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే మిస్కిన్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలపై వెటకారంగా స్పందించాడు. తాను సినిమాకు 40 కాదు 400 కోట్ల బడ్జెట్ అడిగానంటూ కామెంట్ చేశాడు. గతంలో మణికర్ణిక సినిమా సమయంలో కంగనతో అభిప్రాయ బేధాలు వచ్చిన దర్శకుడు క్రిష్ తప్పుకోవటంతో అప్పుడు కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.