టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లకు అదృష్టం మామూలుగా కలిసి రావడం లేదు.. చేసిన ఒకటీ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాప్ హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తున్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన పూజా హెగ్డే కి ఒక లైలా కోసం, ముకుంద సినిమాలు ఏవీ కలిసి రాలేదు.. దాంతో నిరాశలో ఉన్న ఈ బాలీవుడ్ బ్యూటీకి అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం తో అదృష్టం మళ్లీ తలుపు తట్టింది.. అంతే వరుస హిట్స్.. స్టార్ హీరో సరసన ఛాన్సులు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన గీతాగోవిందం తర్వాత వరుస విజయాలు అందుకుంటూ లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక కొంత మంది హీరోయిన్ల పరిస్థితి దారుణం.. అందం, అభినయం ఉన్నా ఒక్క సినిమా కూడా కలిసి రాదు. నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం.. ఒకవేళ హిట్ అయినా ఆ పేరు కాస్త హీరోలకే రావడంతో ఏం చేయలేని పరిస్థితి. ఇలా ఎంతో మంది హీరోయిన్లు కంటికి కనిపించకుండా తెరమరుగయ్యారు. ఇలాంటి జాబితాలోకే వస్తుంది మత్తు కళ్ల సుందరి అను ఇమ్యానుయల్.
మజ్ను, అజ్ఞాతవాసి, శైలజా రెడ్డి అల్లుడు వంటి మూవీస్ తో యువతరంలో మంచి ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది మలయాళీ సొగసరి.. కానీ ఆ మూడు సినిమాల్లో ఒక్క మజ్ను మాత్రంకే సక్సెస్ సాధించింది. తమిళ్ లో ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేదు. దాంతో తెలుగు సినిమాలకు కొంత కాలం దూరంగా ఉంటూ వచ్చిన ఈ సుందరి తాజాగా భారీ ఆఫర్ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ అయినా ఈ మత్తు కళ్ల సుందరికి కలిసి వచ్చేనా చూడాలి.