తెలుగు ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో హీరోగా పరిచయం అయిన మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కెరీర్ లో వరుసగా ఫ్లాపులతో సతమతమయ్యారు. తమ్ముడు, తొలిప్రేమ, సుస్వాగతం లాంటి చిత్రాలతో తానేంటో రుజువు చేసుకున్నారు. వరుస విజయాలు అందుకున్న పవన్ కళ్యాన్ తనదైన మానరీజంతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాన్ మాస్ రేంజ్ ఓ లెవెల్లో పెరిగిపోయింది. అదే సమయంలో జనసేన అనే పార్టీ స్థాపించి ప్రశ్నించడానికి వస్తున్నా అంటూ ప్రజల్లోకి వచ్చారు.
మంచి స్టార్ డమ్ ఉన్న హీరో తమకోసం వచ్చారని అప్పట్లో మెగా ఫ్యాన్స్, ప్రజలు తెగ సంబరపడిపోయారు. అయితే టీడీపీ, బీజేపీకి మద్దతుగా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం పొందారు. అయినా కూడా మొదటిసారిగా ఎన్నికల్లో నిలబడ్డాం.. ఇలాంటివి సహజం.. ఈసారి తమ సత్తా చూపిస్తా అంటున్నారు పవన్. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత పవన్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన తన నెక్ట్స్ చిత్రం ఉంటుందా ఉండదా? అన్న సందేహంలో ఉన్నారు. కానీ పవన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఒకటి కాదు ఏకకాలంలో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. మూడో చిత్రానికి కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ రిమేక్ లో నటిస్తున్నారు. ఈ మూవీకి వకీల్ సాబ్ అనే టైటిల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. మార్చ్ తొలి వారంలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. దాంతో సినిమా షూట్ పూర్తి కానుంది. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటూనే అమరావతి రైతుల కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జనసేన అధ్యక్షుడు. మొత్తానికి సినిమాలు.. రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.