ఇటీవల సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్న యంగ్ హీరో రానా, వరుస ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే హాథీ మేరి సాథీ సినిమాను పూర్తి చేసి రానా ఆ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు రానా. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు 1945 అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు రానా. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దర్శక నిర్మాతలతో రానాకు వివాదం జరుగుతోంది. ఇప్పటికే సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే రానా మాత్రం ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని, షూటింగ్ కాకుండా సినిమా ఎలా రిలీజ్ చేస్తారంటూ వాదిస్తున్నాడు. ఈ విషయంలోనే రానా, దర్శ నిర్మాతల మధ్య వివాదం జరుగుతోంది.
ఇవి కాక గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య కశ్యప పేరుతో ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. చాలా కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా తేజ దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించాడు రానా. గతంలో ఇదే కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు రాక్షస రాజ్యంలో రావణ రాజు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇవే కాదు మరికొన్ని ప్రాజెక్ట్లకు కూడా ఓకే చెప్పాడు రానా. ఇటీవల రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రానా ఓ వీడియో సీరిస్ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో పాటు ఇప్పుడు తన సక్సెస్ ఫుల్ డిజిటల్ షో నంబర్ 1 యారీ కొత్త సీజన్ను కూడా ప్రారంభిస్తున్నాడట.