రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా నరసింహారెడ్డి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మరోసారి చిరంజీవి రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. ఈ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న కొరటాల శివ, మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆదివారం ఓ సినిమా వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ పొరపాటున సినిమా టైటిల్ ఆచార్య అని చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి టైటిల్ ఎనౌన్స్ చేయాలని దర్శకుడు కొరటాల భావించారట. అయితే ఈ లోగా చిరు నోరు జారి టైటిల్ చెప్పేయటంతో ఆయన ఆలోచనలో పడ్డాడు. అదే పేరు కంటిన్యూ చేయాలా లేక మరో టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ టైటిల్ ఇప్పుడు రివీల్ అవ్వటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు టైటిల్ ను మార్చాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆచార్యను వర్కింగ్ టైటిల్ గా ప్రకటించి తరువాత మరో టైటిల్ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.