టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు, కొన్నేళ్ల క్రితం నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. అంతకముందు పలు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన రాజు, ఆ తరువాత మెల్లగా తన తమ్ముడు, స్నేహితుల సాయంతో నిర్మాతగా మారడం జరిగింది. అయితే తొలి సినిమానే రాజుకు మంచి విజయాన్ని అందించి వారి సంస్థకు మంచి పేరు తెచ్చింది. ఇక అక్కడి నుండి వరుసగా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై సినిమాలు నిర్మిస్తూ ముందుకు సాగిన రాజుకు, అప్పట్లో ఎన్నో మంచి విజయాలు దక్కాయి. 

 

అయితే ఇటీవల ఒకానొక సమయంలో రాజుగారి సంస్థ నుండి వరుసగా పరాజయాలు ఎదురవడంతో, ఆ తరువాత నుండి ఆయన కొంత ఆలోచన చేసి, తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మొదలెట్టారు. ఇక మొదటి నుండి మెగాస్టార్, పవర్ స్టార్ లకు వీరాభిమాని అయిన రాజు, ఎప్పటినుండో పవన్ తో తన బ్యానర్ లో ఒక సినిమా నిర్మించాలని ఎంతో ప్రయత్నించారు. అయితే మధ్యలో కొన్ని కొన్ని కారణాల వలన అది సాధ్యపడలేదు. ఇక ప్రస్తుతం పవన్ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ సినిమాని తన బ్యానర్ పై ఎట్టకేలకు నిర్మిస్తున్న రాజు, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కొద్దిరోజుల నుండి ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు, నేడు దిల్ రాజు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అభిమానులకు కానుకగా ఇచ్చారు. 

 

అంతేకాక తమ ప్రొడక్షన్ ఆఫీసుకు విచ్చేసిన పవన్ ఫ్యాన్స్ తో కలిసి కేక్ కట్ చేసి ఆ సంబరాన్ని ఎంతో వేడుకగా జరుపుకున్నారు. రాజు గారి బ్యానర్ ద్వారా పవన్ టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడం ఎంతో అందంగా ఉందని, తప్పకుండా మా పవన్ కు ఆయన హస్తవాసి కలిసి వచ్చి, వకీల్ సాబ్ మంచి హిట్ కొట్టడం ఖాయం అని పవర్ స్టార్ ఫ్యాన్స్ రాజుపై పొగడ్తలు కురిపిస్తున్నారు. మరి మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: