ఆ మద్య కోడీ రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘అరుంధతి’ మూవీలో సోనూ సూద్ డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే. అఘోరాగా సోనూసూద్ భయంకరమైన రూపంగా కనిపిస్తూ.. అనుష్కను బొమ్మాళీ అంటూ వెంట పడతాడు. ఓసేయ్ భొమ్మాళీ ఎనభై ఏళ్లుగా ఈ సమాధిలో కుళ్లబెట్టిన నిన్ను వదల బొమ్మాళీ వదలా.. వస్తా వస్తా.. తప్పక వస్తా.. కసిగా పగనే తీర్చుకుంటా అంటూ థియేటర్ అంతా దద్దరిల్లిపోయేలా డైలాగ్ దుమ్మరేపింది. ఈ డైలాగ్ కొట్టింది తెర వెనుక ఎవరో తెలుసా.. రవి శంకర్. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తమ్ముడు.
చిన్నతనంలోనే నటుడుగా తన ప్రస్థానం మొదలు పెట్టిన రవి శంకర్ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకి వచ్చినంత గుర్తింపు, నటుడిగా రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిశంకర్ నన్ను మంచి నటుడిగా చూసుకోవాలని మా అమ్మగారు అనుకున్నారు. అందువల్లనే నాకు సంగీతం, డాన్స్, ఫైట్స్ ,హార్స్ రైడింగ్ వంటివి నేర్పించారు. ఒక ఆర్టిస్ట్ గా అన్నీ తెలిసుండాలనే ఉద్దేశంతో అప్పట్లోనే అన్నింటిలోను శిక్షణ పొందాను. అయితే వేషాలు అయితే వచ్చాయి కానీ హీరోల స్నేహితులు.. విలన్ వేషాలు.
దాంతో నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. గోపిచంద్ మొదటి సినిమా 'తొలివలపు'లో విలన్ గా నటించాను పెద్దగా సక్సెస్ కాలేదు. నాగార్జున నటించిన 'ఢమరుకం' సినిమాలో చేసిన విలన్ పాత్ర నాకు మంచి బ్రేక్ ఇస్తుందని అనుకున్నాను.. కానీ ఇది కూడా కలిసి రాలేదు. దాంతో నేను కన్నడ పరిశ్రమలోకి వెళ్లాను.. అక్కడ మంచి సక్సెస్ సాధించానని అన్నారు. తెలుగు లో ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేను నటించడానికి రెడీ అన్నారు.