ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. చైనాలో జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు మన దేశంలోకి కూడా ప్రవేశించింది. తెలంగాణలోనూ కరోనా కేసు నమోదు కావటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక ఉత్తరాదిలో దీని ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 28 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే వీరిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు.
కరోనా విషయంలో ప్రజల్లో భయాందోళనలు తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృష్టి చేస్తోంది. అందుకు పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, అఖిల్ లాంటి హీరోలు తమ అభిమానులకు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ట్వీట్ లు చేస్తున్నారు. ఈ లిస్ట్లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చేరారు.
తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తన అభిమానుల కోసం కరోనా అవేర్నెస్ ట్వీట్ చేశాడు. `నమస్కారం.. ` మన సంస్కృతిలో నమస్తే, సలాం మాత్రమే ఉంది. ఎప్పుడు కరోనా అంతం అవుతుందో అప్పుడే షేక్ హ్యాండ్ ఇవ్వండి.. ఆలింగనం చేసుకోండి` అంటూ అభిమానులకు తెలియజేశాడు సల్మాన్. ప్రస్తుతం ఈ కండల వీరుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తున్నాడు.