తెర మీద కొన్ని జంటలను చూస్తే వీళ్లు రియల్ లైఫ్లోనూ జంటలేనా అని అనిపిస్తుంటుంది. అంతా వాళ్ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుంటుంది. తెర మీద వాళ్ల జంటను చూసేందుకు అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో.. ఆ జోడిని తెర మీద చూపించేందుకు దర్శక నిర్మాతలు కూడా అదే స్థాయిలో ఇంట్రస్ట్ చూపిస్తారు. అలాంటి జోడిలో సౌత్ సినిమాలో చాలానే ఉన్నాయి.
ఇటీవల తెలుగు స్క్రీన్ మీద ది బెస్ట్ అనిపించుకున్న జోడి ప్రభాస్, అనుష్క. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ స్థాయిలో వర్క్ అవుట్ అయ్యిందంటే... వాళ్లు మా మధ్య ఏమీ లేదని ఎన్ని సార్లు చెప్పినా సినీ జనాలు మాత్రం నమ్మటం లేదు. ఇప్పటికే వారిద్దరికీ పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు వినిపించాయి. తొలిసారిగా బిల్లా సినిమాలో కలిసి నటించిన ఈ జోడి తరువాత మిర్చి, బాహుబలి సినిమాల్లో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత ప్రభాస్, అనుష్కల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ జాతీయ స్థాయిలో వార్తలు వినిపించాయి.
అదే స్ధాయిలో మెస్మరైజ్ చేసిన మరో సౌత్ జోడి దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్. మళయాల సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఓకె కన్మని సినిమాతో బెస్ట్ అనిపించుకున్న దుల్కర్, నిత్య తెలుగు ఓకె బంగారం పేరుతో టాలీవుడ్లోనూ బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఉస్తాద్ హోటల్, హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ జంట సౌత్ బెస్ట్ జోడీ అనిపించుకుంది.
తమిళ సినిమాలోనూ ఇలాంటి బెస్ట్ జోడి ఉంది. వెల ఇలా పట్టాదారి సినిమాతో తెర మీదకు వచ్చిన బెస్ట్ కపుల్ ధనుష్, అమాలా పాల్. ఈ సినిమాతో తమిళ్ లో సూపర్ హిట్ అందుకున్న ఆ జంట తెలుగులో అదే సినిమాను రఘువరన్ బిటెక్ పేరుతో రిలీజ్ చేసి హిట్ కొట్టింది. తరువాత వీఐపీలోనూ మరోసారి కలిసి నటించారు ధనుష్, అమల.