తెలుగు తెరపై కనువిందు చేసిన హీరో హీరోయిన్ల జంటల్లో బాలకృష్ణవిజయశాంతి జోడీ ఒకటి. కథానాయకుడు సినిమాలో తొలిసారి కలిసి నటించిన వీరిద్దరూ ఎనభైయ్యవ దశకంలో తెలుగు సినిమాల్లో విజయవంతమైన జోడీల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఓ దశలో బాలకృష్ణ కొత్త సినిమా వస్తుందంటే అందులో విజయశాంతే హీరోయిన్ అనేంతగా వీరిద్దరి కాంబో పేరు తెచ్చుకుంది. వీరిద్దరూ జోడీ కట్టిన సినిమాల్లో మెజార్టీ శాతం హిట్లే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి 16 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

 

 

ముఖ్యంగా భార్గవ్ ఆర్ట్ సంస్థ బాలకృష్ణకు ఆత్మీయ సంస్థ. ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనేక సినిమాలు వచ్చాయి. వీటన్నింటిలో బాలకృష్ణవిజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. భార్గవరాముడు, భానుమతి గారి మొగుడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, ముద్దుల మేనల్లుడు, తల్లిదండ్రులు వంటి సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆఖరు సినిమా 1993లో వచ్చిన నిప్పురవ్వ సినిమా. ప్రతి ఫ్రేములో కూడా పోటాపోటీగా నటించే వీరిద్దరి జోడీ అంటే బాలయ్య అభిమానుల్లో మంచి ఆసక్తి ఉండేది. ప్రేక్షకులకు కూడా బాలయ్య, విజయశాంతి జోడీ ఆకట్టుకునేది.

 

 

వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో ముద్దులమావయ్య అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, మువ్వ గోపాలుడు వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. గ్రామీణ నేపథ్యంలో ఉండే సినిమాలు వీరిద్దరూ ఎక్కువగా చేసేవారు. అప్పట్లో బాలకృష్ణ మీద ఎన్టీఆర్ కొడుకు అనే ముద్ర ఉండడం, కుటుంబ సంబంధాల కధలు కూడా కావటం వల్ల కుటుంబ ప్రేక్షకులకు వీరిద్దరి జోడీ ఆకట్టుకునేది. దీంతో టాలీవుడ్ లో బాలకృష్ణవిజయశాంతి ఇద్దరిదీ క్రేజీ కాంబినేషన్ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: