రాహూల్ సిప్లిగంజ్ ఈ పేరు వింటే వెంటనే బిగ్ బాస్ సీజన్ 3 గుర్తుకు వస్తుంది. అక్కినేని నాగార్జున హూస్ట్ చేసిన బిగ్ బాస్ 3 లో వంద రోజులు ఇంట్లో గడిపి అన్ని సవాళ్లను ఎదుర్కొని బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు సింగర్ రాహూల్ సిప్లిగంజ్. చిన్న చిన్న పాటలు పాడుతూ.. ఈ మద్య వెండి తెరపై తన సత్తా చాటుకుంటున్న సింగర్ రాహూల్ సిప్లిగంజ్ తన సొంతగా కూడా కొన్ని ఆల్భామ్స్ తయారు చేసుకున్నాడు. మాస్, మెలోడీ సాంగ్ తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా గచ్చిబౌలిలో ఓ పబ్ లో రాహూల్ పై బీరు బాటిళ్లతో దాడి జరిగిందన్న వార్తలు సంచలనం రేపాయి.
దాంతో రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా ఓ వివాదానికి కేంద్రబిందువు అయ్యాడు. ఈ విషయంపై నిన్న మంత్రి కేటీఆర్ కి కూాడా విన్నపం చేశాడు. తనది ఏదైనా తప్పు ఉంటే శిక్షించాలని.. లేదంటే తనకు మాత్రం న్యాయం చేయాలని కోరారు. దీనిపై రాహుల్ ఓ వీడియోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను చిన్ననాటి నుంచి ఎవరికైనా గౌరవం ఇస్తానని చెప్పారు. ఎవరి జోలికి వెళ్లనని, తనను కెలికితే ఎవరినీ వదిలిపెట్టబోనని స్పష్టం చేశాడు. తన తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని కోరాడు.
అంతే కాదు అసలు పబ్ లో అసలేం జరిగిందన్నది చాలామందికి తెలియదని, అందుకే సీసీ టీవీ ఫుటేజ్ ను బహిర్గతం చేస్తున్నానని చెప్పాడు. అయితే గొడవ జరిగిన సమయంలో నాతో ఐదుగురు మాత్రమే ఉన్నారు.. గొడవ చేసిన వారి గ్రూప్ లో చాలా మంది ఉన్నారు. నాపైకి ఎనిమిది మంది దాడికి వచ్చారు. తాను ఎంతో సమర్థంగా ఆత్మరక్షణ చేసుకోగలిగానని, అందుకే పెద్ద ప్రమాదం తప్పిందని భావిస్తున్నానని తెలిపాడు. ఆ సమయంలో మరో ముగ్గురు ఉండుంటే అక్కడ మస్త్ మజా వచ్చేదని రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యానించాడు.