తెలుగు సినిమా రంగంలో సీనియర్ నటులు ఆయిన మాగంటి మురళీమోహన్, రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్లో మురళీమోహన్ హీరోగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 1973లో ఈయన అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో ఈయనకి నటునిగా గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత దాదాపు 300 సినిమాలకు పైగా నటించి మెప్పించారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు అలియాస్ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. చిలకా గోరింక చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత 150 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక 1970వ దశకం నుంచి మురళీమోహన్, కృష్ణంరాజు మంచి మిత్రులు. అయినప్పటికీ, వీరిద్దరూ రాజకీయంగా మాత్రం వేరు వేరు దారులు ఎంచుకున్నారు. మురళీమోహన్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అలాగే కృష్ణంరాజు ముందు కాంగ్రెస్ పార్టీతో తన ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత బీజేపీలోకి చేరారు. ఆ పార్టీ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ లోకి వెళ్లి.. తిరిగి ఇప్పుడు బీజేపీ గూటికి చేరుకున్నారు. అయితే సినిమా రంగంలో ఉన్న ఈ ఇద్దరూ రాజకీయ రంగంలో మాత్రం వేరే పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు.
ఇక ఈ స్నేహితుల మధ్య ఒక సారి ఎన్నికల్లో వార్ తప్పలేదు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోగా మరో వ్యక్తి గెలుపొందడం విశేషం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రాజమండ్రి ఎంపీగా కృష్ణంరాజు పోటీ చేశారు. అదే ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి మురళీమోహన్ పోటీ చేశారు. కానీ, నాటి వైఎస్ ప్రభంజనం ముందు రాజమండ్రి లో ఇద్దరు సినిమా హీరోలు ఓడిపోగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఘన విజయం సాధించారు. ఇలా వైఎస్ ఛరిష్మా ముందు మురళీమోహన్, కృష్ణంరాజు సినీ గ్లామర్ ప్లాపైంది.