తెలుగు సినిమా రంగంలో హీరోలే కాకుండా హీరోయిన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారు ఎందరో ఉన్నారు. అలనాటి మేటి హీరోయిన్స్ అయినా శారద, జయసుధ, జయప్రద, జమున ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వెండితెరను ఏలిన వాళ్లు.. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నారు. వీరిలో జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ నుంచి ఏకంగా రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.
గత ఎన్నికల్లో బీజేపీ లోకి జంప్ చేసిన జయప్రద ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆ తర్వాత తరంలో విజయశాంతి, రోజా లాంటి వాళ్లు సైతం అటు వెండి తెరతో పాటు.. ఇటు రాజకీయ రంగంలోనూ రాణిస్తున్నారు. విజయశాంతి కాంగ్రెస్ నుంచి కీలక నేతగా ఉన్నారు. ఈమె గతంలో టీఆర్ఎస్ ఎంపీగా కూడా పని చేశారు. ఇక రోజా వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరియు ఖుష్బూ తమిళనాడు కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరించారు. అలాగే వర్ధమాన హీరోయిన్లలో మాధవీలత బీజేపీ లోకి వెళ్లారు.
ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన `ఈ రోజుల్లో` సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రేష్మా రాథోర్. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్ గా బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన రేష్మా.. వైరా ఎస్టీ రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయారు. ఇక ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉన్నారో.. ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.