బాలీవుడ్ లో ఈ మద్య వస్తున్న చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. చిన్ని చిత్రాలైనా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సార్లు రుజువైంది. తాజాగా ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించిన ‘అంగ్రేజీ మీడియం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంతో ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. ఇర్ఫాన్ కుమార్తెగా రాధికా మదన్ కనిపించనుంది. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కరీనా కపూర్ పాత్ర ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. గతంలో ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘హిందీ మీడియం’ చిత్రం భారత్లో సుమారు రూ.70 కోట్లు, చైనాలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.
దేశంలో విద్యా వ్యవస్థ సామాన్యులను ఎంతగా పట్టి పీడిస్తుందో అందరికీ తెలిసిందే. మద్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకోవాంటే.. ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో ఈ చిత్రంలో చూపించాడు. విద్యా వ్యవస్థ వ్యాపారమయంగా మారిన దుస్థితిని ఈ చిత్రం కళ్లకు కట్టింది. హిందీ మీడియంలో చదివి ఇంగ్లిష్ సరిగా రాక అవమానాలకు గురవుతున్న ఓ తండ్రి, తన కుమార్తెను ఓ కార్పొరేట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేర్చాలను కున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం. అయితే హిందీ మీడియం సీక్వెల్ గా ‘అంగ్రేజీ మీడియం’ తెరకెక్కించారు.
ఇంగ్లీష్ రాని ఓ తండ్రి తన కూతురు ఉన్నత చదువులు చదివించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తుంది. ఇర్ఫాన్ ఖాన్ కుమార్తె ఉన్నత చదువుల కోసం లండన్కు వెళ్లాలనుకుంటుంది. అక్కడ ఓ ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే రూ.కోటి ఫీజు కట్టాల్సి ఉంటుంది. అది ఇర్ఫాన్కు తలకు మించిన భారం. అయినా సరే అక్కడే చదవాలన్నది కూతురి కల. వారంలో ఫీజు కట్టకపోతే ఆ సీటు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కోటి రూపాయలు ఎలా సంపాదిస్తాడు.. తనకు లండన్లో పోలీస్గా పనిచేసే కరీనాతో ఎలా పరిచయం ఏర్పడింది.. ఇంతకీ తన కూతురుని లండన్ పంపిస్తాడా అన్నది తెరపై చూడాల్సిందే అంటున్నారు.