ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణాలకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. గత ఏడాది అయితే టాలీవుడ్ కి సంబంధించి టాప్ దర్శక, నిర్మాతలు కన్నుమూసిన వివషయం తెలిసిందే. తాజాగా బెంగాల్ నటుడు సంతు ముఖోపాధ్యాయ్(69) దక్షిణ కోల్కతాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 4 దశాబ్ధాలకి పైగా తన నటనతో అలరించిన సంతు కొన్నాళ్లుగా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా 1951లో కోల్కతాలో జన్మించిన సంతు యుక్త వయస్సులోనే సినీ రంగంలో ప్రవేశించారు. సంసార్ సిమాంటే, రాజా, భాలోబాసా భాలోబాసా వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు.
నటుడిగా విరామం తీసుకున్న తర్వాత సంతూ ముఖోపాధ్యాయ్ బుల్లితెరపై పలు సిరియల్స్ లో నటించి మెప్పించారు. అయితే కొంత కాలంగా ఆయన గుండె జబ్బుతో బాధపడుతున్నారట. అప్పట్లో బెంగాల్ తెరపై సంతూ కి ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆయన నటించిన చిత్రాలకు మంచి హిట్ టాక్ వచ్చాయి. బెంగాల్ సీనియర్ నటుల్లో ఆయన ఒకరు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సీరియల్స్ లో తాతయ్య పాత్రల్లో నటించారు. కొంత కాలంగా ఆయన శ్వాస తీసుకుకునే పరిస్థితిలో ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇటీవల హైబీపీ, హైపర్టెన్షన్కి గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొద్దిగా ఆయన ఆరోగ్యం కుదుటపడినట్టు కుటుంబ సభ్యులు భావించగా, ఫిబ్రవరి 4న ఆయన్ని ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం సంతుకి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సంతు ముఖోపాధ్యాయ్కి ఇద్దరు కూతుళ్లు స్వస్థిక ముఖర్జీ, అజోపా ముఖర్జీ ఉండగా, స్వస్థిక ముఖర్జీ నటిగా రాణిస్తుంది. అజోపా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నారు. కాగా, సంతు ముఖోపాధ్యాయ్ మృతిపై బెంగాల్ చిత్ర పరిశ్రమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం, సానుభూతి తెలియజేశారు.