కరోనా వల్ల ప్రస్తుతం క్రీడా రంగమే కాదు సినిమా రంగం కూడా కుదేలవుతుంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కరోనా ప్రభావం లేకున్నా థియేటర్లకు వెళ్లేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు దాంతో సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నారు నిర్మాతలు. అలా వాయిదా పడ్డ సినిమాల్లో నేచురల్ స్టార్ నాని ,సుధీర్ బాబు కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం వి కూడా ఒకటి. ఉగాది కానుకగా మార్చి 25న విడుదలకావాల్సి ఉండగా కరోనా భయంతో ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదావేశారని సమాచారం.
 
ఏప్రిల్ చివర్లో వి ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ చేయడం కూడా  ఆపేశారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనుండగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. నానికి ఇది 25వ సినిమా.. దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తుండగా నివేత థామస్ ,అధితి రావ్ హైదరి కథానాయికలు నటించారు. ఇక ప్రస్తుతం నాని, శివ నిర్వాణ డైరెక్షన్ లో టక్ జగదీశ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
 
ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా నానికి జోడిగా రీతూ వర్మ ,ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈచిత్రం జులై లో విడుదలకానుంది. ఈ సినిమాను పూర్తి చేసి  నాని, టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో శ్యామ్ సింగ్ రాయ్ లో నటించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: